కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ !

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కోవిడ్‌-19 వైరస్‌ను నిర్మూలించడానికి ఆయా దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. జనవరి 10న కోవిడ్‌-10 వైరస్‌ జెనెటిక్‌ సీరిస్‌ను చైనా పరిశోధకులు వెల్లడించిన తర్వాత పరిశోధనలు తీవ్రతరం చేశారు. చైనా, అమెరికా, యూరప్‌ దేశాలతో పాటు భారత్‌ కూడా వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశాయి.  చైనాలో ఇప్పటికే ఈ విషయంలో క్లినికల్‌ ట్రయల్స్‌ వరకు వెళ్లింది. వ్యాక్సిన్‌ తయారీకి చైనా దేశానికి చెందిన వెయ్యి మందికి పైగా శాస్త్రవేత్తలు 24 గంటలు శ్రమిస్తున్నారు. వ్యాక్సిన్ల తయారీలో నైపుణ్యం కలిగిన మిలటరీ మెడికల్‌ సైన్సెస్‌లో కరోనా విరుగుడుకు వ్యాక్సిన్‌ తయారు చేసినట్లు తెలుస్తోంది. మార్చి 16న మొదటి ట్రయల్‌ జరిగిందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా వూహాన్‌ నగరానికి చెందిన 108 మందిని మూడు బృందాలుగా విభజించారు. 18-60 ఏండ్ల వయస్సున్న వీరికి భిన్నమైన డోసులు ఇచ్చారు.  వీరిలో కొంతమందికి జ్వరం లక్షణాలు ఉన్నప్పటికీ వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే జంతువులపై ఈ వ్యాక్సిన్‌ను పరీక్షించారు. వీరందరినీ 14 రోజులపాటు ఐసోలేట్‌ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రొఫెసర్‌ సారా గిల్‌బర్డ్‌, ప్రొ. ఆండ్య్రూ పోలార్డ్‌, థెరిసా లాంబే, సాండే డగ్లస్‌, ఆండ్రియన్‌ హిల్‌లు నేతృత్వం వహిస్తున్నారు. ఇక్కడ ChAdOx1 వ్యాక్సిన్‌ తయారుచేస్తున్నారు. ఇక్కడ గతంలో MWERS-Cov కరోనా వైరస్‌లకు వ్యాక్సిన్‌ను తయారుచేశారు. అమెరికా కూడా వైరస్‌ను నియంత్రించే వ్యాక్సిన్‌ తయారుచేసే పనిలో పడింది. ఈ దేశానికి చెందిన పలు కంపెనీలు వ్యాక్సిన్‌ తయారీలో ముందంజలో ఉన్నాయి. గతవారంలో యూఎస్‌ఏలో ఎంఆర్‌ఎన్‌ఏ1273 వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ చేశారు.