న్యూజిలాండ్ ప్ర‌ధాని, మంత్రుల జీతాల్లో 20 శాతం కోత‌

న్యూజిలాండ్ ప్ర‌భుత్వం కూడా జీతాల్లో కోత విధించింది. త‌మ మంత్రులంద‌రికీ ఆరు నెల‌ల పాటు జీతాల్లో 20 శాతం కోత ఉంటుంద‌ని ప్ర‌ధాని జెసిండా ఆర్డెన్ తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయిన‌వారికి, జీతాల్లో కోత గురైన‌వారికి సంఘీభావంగా ఈ చ‌ర్య తీసుకున్న‌ట్లు ఆమె చెప్పారు.  క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ప్ర‌పంచ‌దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ స్తంభించింది. దీంతో చాలా వ‌ర‌కు దేశాలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి.  జీతాల‌ను కూడా త‌క్కువ చెల్లిస్తున్నాయి. వివిధ హోదాల్లో ఉన్న వ్య‌త్యాసాన్ని త‌గ్గించేందుకు ఇదే స‌రైన స‌మ‌యం అని జెసిండా తెలిపారు. ప్ర‌ధాని జెసిండా సుమారు మూడు లక్ష‌ల డాల‌ర్ల జీతాన్ని ఆర్జిస్తున్నారు. అయితే ప్ర‌భుత్వ అధికారులు, ఇత‌ర నేత‌ల జీతాల్లోనూ  కోత విధించ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను కివీస్ అన్ని దేశాల క‌న్నా ముందే అమ‌లు చేసింది. అయినా ఆ దేశం ఈ ఏడాది 7.2 శాతం న‌ష్ట‌పోనున్న‌ట్లు ఐఎంఎఫ్ పేర్కొన్న‌ది.